రేపటితో ముగుస్తోన్న తెలంగాణ టెట్ 2024 ఆన్లైన్ దరఖాస్తులు...!
రేపటితో ముగుస్తోన్న తెలంగాణ టెట్ 2024 ఆన్లైన్ దరఖాస్తులు... పరీక్ష తేదీలు ఇవే!
హైదరాబాద్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (మార్చి) 2024 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తులు ఏప్రిల్ 10వ తేదీతో ముగియనున్నాయి.
ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా పేర్కొంది. దరఖాస్తుల అనంతరం ఏప్రిల్ 15వ తేదీ నుంచి హాల్టికెట్ల జారీ ప్రారంభమవుతుంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు సీబీటీ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించి ఉండాలి. టెట్ అర్హత ఉన్నవారికే రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. పేపర్ 1 పరీక్షకు డీఈడీ అర్హతతో పాటు ఇంటర్లో జనరల్ అభ్యర్థులకైతే 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2015లోపు డీఈడీ పూర్తి చేసినవారు జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 45 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించాలి. జూన్ 12వ తేదీన టెట్ ఫలితాలు విడుదలవుతాయి.
ఇక టెట్ పేపర్ 2 పరీక్షకు డిగ్రీ అర్హతతో పాటు బీఈడీ సర్టిఫికెట్ ఉండాలి. డిగ్రీలో జనరల్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ చేసిన వారైతే జనరల్ అభ్యర్ధులకు 50 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది. ప్రస్తుతం వివిధ పాఠశాలల్లో సర్వీస్లో ఉన్న టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.
టెట్ పరీక్ష రెండు పేపర్లకు ఉంటుంది. ఒక్కో పేపర్కు 150 మార్కులకు ఉంటుంది. ఆయా తేదీల్లో పేపర్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. జనరల్ కేటగిరీ 90, బీసీ 75, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందవచ్చు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో వచ్చిన మార్కులకు 80 టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.